హేమంతమని పిలిచినప్పుడే గమనించావనుకున్నా..
వసంతుని మించిన అందంతో..
హృదివేదికపై పరవశానికే వారసుడిగా నువ్వడుగేసినప్పుడు..
వాయులీనమై వినబడ్డ వేణుగానం..
ఆలపించింది నువ్వేననుకున్నా
తడియారని నా స్మృతులను తడుముకుంటుంటే..
ఆ పొన్నచెట్టుకింద నీకై నిరీక్షించిన
ఆరాధనా గీతికను నేనేనని కనుగొన్నా..
నీవో స్వరమాలపిస్తే నీలో నాదాన్నై..
నీవో కుంచె కదిపితే నీ గీతాల్లో గిలిగింతనై..
నీవో కవితనావిష్కరించబోతే నేనే కలాన్నై..
నీలో ఒదిగిపోయింది నేనేనని అనుకున్నా..
ఇన్నిమాయలూ చేసిన నీవో ఇంద్రజాలమైతే..
నీ మోవిలోని మకరంద మాధుర్యం నాదని అంటావేం సరసిజా..!!
No comments:
Post a Comment